1949 లో విడుదల అయిన మనదేశం చిత్రం నటుడిగా నందమూరి తారక రామారావు గారిని తెలుగువారికిచ్చి, ఆ కళామతల్లికి ముద్దు బిడ్డగా పెంచి, తదుపరి చిరస్మరణీయమైన పౌరాణిక, సాంఘిక పాత్రలలో జీవింపజేసి విశ్వ విఖ్యాత నట సార్వభౌమునిగా తీర్చి దిద్దింది. భారత స్వరాజ్య సంగ్రామము నేపధ్యంగా "విప్రదాస్" అనే బెంగాలి నవల ఆధారంగా నిర్మించబడిన సాంఘిక చిత్రమిది. ఇందులో రామారావు గారు పోలీస్ ఇన్స్పెక్టర్ గా నటించారు. అయితే రాజకీయ ఇతివృత్తం నేపధ్యంలో చిత్రంగా మొదలయిన 'మనదేశం' తెలుగువారి ఆత్మగౌరవమనే వేదికపై సింహనాదంగా మారి 'తెలుగుదేశం' ఏర్పడటానికి దారి తీస్తుందని "అన్నగారు" ఆనాడు అనుకొని ఉండకపోవచ్చును. మనదేశం చిత్రం కోసం రెండు శ్లోకాలు, ఒక బుర్రకథ, కొన్ని పాటలు మాస్టారు గానం చేసారు. శ్లోకాలు ఇక్కడ పొందు పరుస్తున్నాను.
సంగీతం: ఘంటసాల
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
రామ్ రామ్ రామ్
ఈ శ్లోకానికి మూలం రామాయణమని, రావణ వధానంతరం లక్షణునితో శ్రీరాముడు ఈ శ్లోకాన్ని పేర్కొన్నాడని కొందరి అభిప్రాయం. ఈ పంక్తికి మరొక విశిష్టత వుంది. 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అనేది నేపాల్ దేశపు 'ఆదర్శవాక్యం" (motto). భారతదేశానికి "సత్యమేవ జయతే" అని అనుకుంటాను. అయితే రామాయణ కథనం ప్రకారం ఈ పంక్తికి ముందు ఇంకొక పంక్తి వున్నది. అదేమిటంటే..
అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
తాత్పర్యం: "ఓ! లక్ష్మణా! ఈ స్వర్ణమయమయిన లంక నన్ను ఏవిధంగా ఆకట్టుకోలేదు. కన్నతల్లి, పుట్టిన ప్రదేశము స్వర్గం కన్న మిన్న సుమా!"
మనదేశం చిత్రం కోసం ఘంటసాల మాస్టారు గానం చేసిన ఇంకొక శ్లోకం పంచమ వేదం మహాభారతం లోని పవిత్ర భగవద్గీత నుండి గ్రహించబడింది. భగవద్గీత లో మొదటి అధ్యాయమైన "అర్జున విషాద యోగం" లో 33 వ శ్లోకమ్ లో అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు:
యేషామర్థే కాంక్షితమ్ నో రాజ్యం భోగాః సుఖాని చ
త ఇమే(అ)వస్థిత యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ
త ఇమే(అ)వస్థిత యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ
తాత్పర్యం: "మనం ఎవరి గురింఛి రాజ్యాన్ని, భోగ భాగ్యాలను, అన్ని సుఖాలను కోరుతున్నామో, వారంతా తమ ధనాన్ని, ప్రాణాలను సైతం వదలుకునేందుకు సిద్ధపడి ఈ యుద్ధ భూమిలో నిలిచి యున్నారు".
గమనిక: శ్లోకం తరువాత వచ్చే వ్యాఖ్యానంలో వినపడిన ఇద్దరి గొంతుకలలో రెండవది మాస్టారిది.







